Subbarao Gupta: ఒంగోలుకు చెందిన వైసిపి నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తో జతకట్టారు.వారిద్దరూ కలిసి తీయించుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు జిల్లాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే!
సుబ్బారావు గుప్తా ఇటీవల జిల్లా మంత్రి బాలినేని వాసు తో సహా పలువురు వైసిపి నేతలపై ఘాటు విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన నివాసంపై దాడి జరిగింది.మంత్రి వాసు అనుచరుడు సుభానీ గుంటూరులోని ఒక లాడ్జిలో గుప్తాని పట్టుకుని తీవ్రంగా కొట్టిన వీడియో కూడా వైరల్ అయింది.దీంతో ఆర్యవైశ్య సంఘాలు రంగంలోకి వచ్చాయి.ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సమాయత్తమయ్యాయి.చివరకు వైసిపి ఆర్యవైశ్య గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఈ సంఘటనను ఖండించారు. ఇది సరైన విధానం కాదని తెలిపారు
Subbarao Gupta: వాసు వల నుండి జారుకున్న గుప్తా!
రాజకీయంగా కూడా తనకు ఇబ్బందులు తెచ్చిపెట్టే విధంగా పరిణామాలు ఉండటంతో మంత్రి వాసు సమయస్ఫూర్తి ప్రదర్శించి గుప్తాను అనునయించే ప్రయత్నాలు చేశారు.అవి ఫలించినట్లే కనిపించాయి. ఒక దశలో వివాదం సమసిపోయిందని మంత్రి వాసు తనకు అన్ని విధాలా అండగా నిలబడ్డారని కూడా సుబ్బారావు గుప్తా చెప్పారు.అయితే అకస్మాత్తుగా గుప్తా యూటర్న్ తీసుకున్నారు.
హస్తిన కు పోయి రావెల!
నేరుగా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ లో తనకు న్యాయం చేయాలని,తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని హోంమంత్రి అమిత్ షాను కోరుతూ బ్యానర్ పట్టుకొని దీక్ష చేశారు.వెనువెంటనే ఢిల్లీలోనే ఉన్న వైసిపి నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆయన కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారని సమాచారం.పార్టీలో ఏం జరుగుతుందో,ఎవరి వల్ల నష్టం కలుగుతుందో తాను చెప్పగా తానే వారికి టార్గెట్ అయ్యాయని అయ్యానని సుబ్బారావు గుప్తా ఆ ఎంపీ వద్ద వాపోయాడు.
నాది నీ బాపతు కేసే అన్న ఎంపీ!
తనది కూడా సేమ్ కేసేనని,నిజాలు చెబితే వైసిపి నేతలకు నచ్చడం లేదని ఎంపీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.పార్లమెంట్ సభ్యుడినైన తననే పోలీసులు చితకబాదారని,వైసిపి హయాంలో ఇవన్నీ సర్వసాధారణమని రఘురామకృష్ణంరాజు గుప్తాను ఊరడించారు
తాను అండగా ఉంటానని ఆయన గుప్తాకు భరోసా ఇచ్చారంటున్నారు.ఈ వ్యవహారం ప్రకాశం జిల్లా వైసిపిలో హాట్ టాపిక్ గా మారింది.