కడప, మార్చి 16: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఏ మాత్రం లేదని రాగిపిండి సుధాకరరెడ్డి స్పష్టం చేస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో సుధాకరరెడ్డి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు.
శుక్రవారం వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగిన నేపథ్యంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అధికార పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి ఆదినారాయణరెడ్డిలపై ఆరోపణలు చేశారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవించి వచ్చిన సుధాకర్రెడ్డితో ఈ హత్య చేయించారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న సుధాకరరెడ్డిని ఒక తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా తనకు ఈ హత్యతో తనకు ఏ సంబంధం లేదనీ, ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. జైలు నుండి విడుదల అయి వచ్చిన తరువాత వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవనం సాగిస్తున్నానని తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందని భావిస్తే ఏ శిక్షకయినా సిద్ధమని సుధాకరరెడ్డి పేర్కొన్నారు.
సిట్ అదుపులో నలుగురు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగంవంతం చేశారు.
వివేకా ఇంట్లో పని చేసే వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు అశోక్, డ్రైవర్ ప్రసాద్, వివేకా పిఎ కృష్ణారెడ్డినిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.