Fuel Prices: పదమూడురాష్ట్రాలు,ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన 29 అసెంబ్లీ,మూడు లోక్సభ స్ధానాల ఉప ఎన్నికలలో బిజెపికి అనూహ్య ఎదురు దెబ్బలు తగిలాయి.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు ఆ పార్టీకి వచ్చాయి.చివరకు బిజెపి అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా శృంగభంగం తప్పలేదు.2014 లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడేళ్లలో ఈ స్థాయిలో బిజెపికి కాంగ్రెస్ నుండి పోటీ ఎదురుకాలేదు.
Fuel Prices: పోస్టు మార్టంలో వెల్లడైన నిజమిదే!
దీంతో భారతీయ జనతాపార్టీ ఎందుకిలా జరిగిందన్న అంతర్గత సమీక్షను అతి లోతుగా జరిపిందని సమాచారం.ఉన్నట్టుండి ఎందుకు ప్రజా వ్యతిరేకత ప్రబలి౦దన్న కోణంలో నుండి కూడా ఆ పార్టీ అగ్రనేతలు మేధోమథనం సాగించారు. మిగతా విషయాలన్నీ పక్కన బెడితే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, అంతకుమించి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతకు కారణం అయిందని ఇంటెలిజెన్స్ వర్గాల నుండి కూడా వారికి నివేదిక అందినట్లు భోగటా.
ఎన్నికలకు సిద్ధమైన మరో అయిదు రాష్ట్రాలు
పైగా మరో ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.ఇలాగే ఇంధన ధరలు పెరుగుతూపోతే ఆ ప్రభావం తప్పనిసరిగా ఐదురాష్ర్టాల్లో కనిపిస్తుందని బీజేపీ అధిష్టానం అంచనా వేసింది.తక్షణం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది.అందుకే ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Fuel Prices: ఇది రాజకీయ నిర్ణయమే!
దీనికి ఎన్నికలకు సంబంధం లేదని బిజెపి చెప్పుకోవచ్చు,అయితే అకస్మాత్తుగా ఎందుకు తగ్గించిందో కేంద్ర ప్రభుత్వమైనా చెప్పాలి.ఉప ఎన్నికలకు ముందు వరకు రాకెట్ లా దూసుకుపోయిన ఇంధన ధరలపై నోరు మెదపని కేంద్ర ప్రభుత్వంగానీ, బీజేపీగానీ బై ఎలక్షన్లలో చేదు ఫలితాలు రాగానే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి చేయడం వ్యూహాత్మకమని చెప్పక తప్పదు.ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది.పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రకటన వెలువడిన వెంటనే పది బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా నాటకీయంగా వ్యాట్లో కొన్ని రూపాయలు తగ్గించాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో మోడీ భక్తులు వహ్వా, ఆహా, ఓహౌలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గిస్తాయా లేదా అంటూ సవాళ్లు విసరడం ప్రారంభించారు.
రాష్ర్టాలకు తగ్గనున్న కేంద్ర నిధులు?
కాగా బిజెపి మద్దతుదారులు చేస్తున్న వాదన ప్రకారం కేంద్రం విధిస్తున్న చమురు పన్ను భారంలో రాష్ట్రాలకు 41శాతం వాటాగా తిరిగి వస్తుంది, కేంద్రం కూడా తన వంతు రాష్ట్రాలలో వివిధ పధకాలకు ఖర్చు చేస్తున్నది కనుక చమురుపై ఎక్కువ భారం మోపుతున్నది రాష్ట్రాలే అని చెబుతున్నది తెలిసిందే. గణాంకాలతో వారి వాదన ప్రకారమే 41శాతం అంటే ప్రతి ఐదు రూపాయలలో రు.2.05 పెట్రోలు మీద, డీజిలు మీద రు.4.10 రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తద్వారా ఆ మేరకు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో కూడా కోత పడుతుంది.ఇది ఈ ప్రభావం అమలవుతున్న సంక్షేమ పథకాల మీద పడే ప్రమాదం పొంచి ఉంది.పెట్రోల్ డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఎవరి వాటా వారికి అందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.