ఈఎస్ఐ అవినీతి కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. బీసీలపై దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలో అరెస్టయిన అచ్చెన్నాయుడికి కలవడానికి బాబు ప్రయత్నించినా… అధికారులు అనుమతి ఇవ్వని సంఅతి తెలిసిందే! ఈ క్రమంలో అరెస్టయిన అచ్చెన్నాయుడిపై రోజుకో రకమైన కామెంట్లు చేస్తున్నారు వైకాపా నేతలు. అందులో చాలావరకూ విమర్శలే అయితే… మరికొన్ని మాత్రం సూచనలుగా ఉన్నాయి! ఆ సూచనలు కూడా… ఈ కేసు నుంచి అచ్చెన్నాయుడు ఎలా బయటపడొచ్చో.. ఏమి చేస్తే ప్రభుత్వం ఈయనను వదిలేసే అవకాశం ఉందో చెప్పేలా ఉన్నాయి!
వివరాళ్లోకి వెళ్తే… ఈ కేసులో అవినీతి జరిగిందని చెబుతున్న రూ. 150 కోట్లలో అచ్చెన్నాయుడికి ఏ ఐదో పదో ఇచ్చి మిగిలిన మొత్తం సొమ్మును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లు దోచేసి ఉంటారని ఆరోపించారు ఏపీ మంత్రి కొడాలి నాని! ఈ సమయంలో అచ్చెన్నాయుడు కాస్త మనసుమార్చుకుని అప్రూవర్ గా మారిపోతే.. ప్రభుత్వం ఆయనను వదిలేసి.. ఈ తండ్రీ కొడుకులిద్దరినీ పట్టుకుంటుందని ఒక సూచన చేశారు.
కొడాలి నాని సూచన అలా ఉంటే… దాదాపు అలాంటిదే మరో సూచన చేశారు వైసీపీ ఎంపీ విజయసారెడ్డి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే సాయిరెడ్డి… ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “‘అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే. ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు. బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు రాసానని అంగీకరించి, గుట్లు మట్లన్నీ చెప్పేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా” అంటూ ట్వీట్ చేశారు. అరెస్టయిన అచ్చెన్నాయుడికి ఇది విజయసాయి రెడ్డి సూచన!