సంక్షేమ పథకాలను జెట్స్పీడుతో అమలు చేస్తూ అన్ని వర్గాలను అలరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని నిందలను మాత్రం మోయక తప్పని పరిస్థితి నెలకొంది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురువింద గింజ చందంగా తాను గత నాలుగేళ్లుగా చెయ్యలేని విషయాలన్నింటినీ జగన్ పైకి తోసేసి ఆయన ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి చంద్రబాబు సీఎంగా వైఫల్యం చెందారు కాబట్టే టిడిపిని ఏపీ ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారు.అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టే అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై రాళ్లు రువ్వుతున్నారు.జగన్ రాష్ట్రాలు అప్పుల కుప్ప చేశాడని కరోనాను అదుపు చేయలేక పోయాడని ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే సందర్భంలో చంద్రబాబు అధికారంలో ఉండగా రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం మర్చిపోలేదు.ప్రత్యేక హోదాను పక్కన పెట్టడాన్ని కూడా జనం గుర్తుంచుకున్నారు.గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు వైఫల్యం అందరికీ గుర్తుండే ఉంటుంది.అయితే చంద్రబాబు చేసే ఆరోపణలను పూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు.తనకు ఇరవై అయిదు లోక్సభ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదాను తెచ్చి పెడతామని జగన్ ఊరూవాడా తిరిగారు.ఇరవై రెండు లోక్సభ స్థానాలను ప్రజలు వైసిపికి కట్టబెట్టారు .
అయితే ప్రత్యేక హోదా విషయాన్ని జగన్ అటకెక్కించారు.పైగా బిజెపికి తిరుగులేని మెజారిటీ వచ్చినందున వారికి వైసీపీ తో సహా ఇతర పార్టీలతో పనే లేదని ఇక తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులు చేసుకునే పరిస్థితి లేదని జగన్ చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇది అవునన్నా కాదన్న అవకాశవాద రాజకీయమే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఊరికే అప్పులు చేయడం, సంక్షేమం పేరిట పంచడం కాదు, తెచ్చిన ప్రతీ రూపాయిని రెండు రూపాయలు చేసేలా ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి.
ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలి. నీటిపారుదల రంగాన్ని తీర్చిదిద్దాలి. అభివ్రుద్ధికి బాటలు వేయాలి. మూడు రాజధానుల విషయంలో ఉన్న పట్టుదల కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలోనూ జగన్ కి ఉండాలి. ప్రత్యేక హోదా అపుడపుడు పాడే పాటగా కాదు, కేంద్రం మెడలు వంచి ఎప్పటికైనా తెచ్చేలా ఉండాలి. అపుడే జగన్ని దమ్మున్న సీఎం అని జనం అంటారు. చంద్రబాబుకు వేలెత్తి చూపే అవకాశం లేకుండా చేయాలంటే జగన్ ఈ తరహా పాలన సాగించాలని, మాట తప్పరు. మడమ తిప్పరుఅని వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న బ్రాండ్ నేమ్ ని ఆయన నిలబెట్టాలని రాజకీయ పండితులు హితవు పలుకుతున్నారు.