విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేయడంతో పలువురు పోలీసులకు సమాచారం అందించారు. గుణదల పోలీసులు కాలువ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లభించకపోవడంతో ఎన్ డీ ఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాయి. రెండు రోజుల పాటు గాలింపు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినా బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక ఆత్మహత్యయత్నంపై పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నించగా పదవ తరగతి పరీక్ష ఫెయిల్ అవ్వడంతో కాలువలోకి దూకేసిందని చెప్పారు.
కాులవలోకి దూకిన బాలిక ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు విశాఖ లో ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చింది. భర్తను ఏమార్చి విశాఖ సముద్ర తీరంలో గల్లంతు అయినట్లు కలరింగ్ ఇచ్చి సాయి ప్రియ అనే వివాహిత ప్రియుడితో జంప్ అయిన విషయం తెలిసిందే. నిజంగా ఆమె సముద్రంలో గల్లంతు అయ్యిందనుకొని కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించకపోవడంతో చివరకు లక్షలాది రూపాయలు వెచ్చించి హెలికాఫ్టర్ తోనూ గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆమె ప్రియుడితో కలిసి జంప్ అయినట్లు తెలుసుకున్నారు. ఈ బాలిక విషయంలో అటువంటి స్టోరీ ఏమైనా ఉందేమోనని పోలీసులు ఆరా తీయడంతో ఆ బాలికకు ప్రేమ వ్యవహారం ఉందనీ, ఈత కూడా వచ్చని తెలిసింది.
స్థానికంగా ఉండే రౌడీ షీటర్ దుర్గారావు తో ఈ బాలిక మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోందని పోలీసులు తెలుసుకున్నారు. రౌడీ షీటర్ తో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరని భావించి ఈ విధంగా సూసైడ్ ప్లాన్ చేసి ఉండవచ్చని భావించారు. దుర్గారావు గురించి వాకబు చేయగా అతను కూడా లేకపోవడంతో ఇద్దరూ కలిసి జంప్ అయి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు సుమారు నెలరోజులు పట్టింది. పోలీసులకు అసలు విషయం తెలియడంతో ఆ బాలికతో పాటు దుర్గారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.