క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు అడివి శేష్తో. ఇప్పుడు ఈ యంగ్ హీరోతో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా మారి ‘మేజర్’ అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇండియాలోనే ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ అయిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ తో కలిసి మహేష్ బాబు జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ లో ఈ సినిమాని నిర్మించడం విశేషం. అంతేకాదు అడివి ఎంటర్ టైన్మెంట్, శరత్ చంద్ర, ఎ+జి మూవీస్ ఈ సినిమాకి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మేజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం జరుపుకుంది.
ద్విభాషా చిత్రంగా తెలుగు, హిందీ భాషల్లో భారీ బడ్జెట్తో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే సోనీ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ లో ‘ప్యాడ్ మాన్, 102 నాటౌట్’ వంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించారు సోనీ పిక్చర్స్ సంస్థ.
26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథను ఆధారంగా చేసుకొని మేజర్ సినిమాను తెరకెక్కించనున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హీరో అడవి శేష్ రచనా సహకారం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలలో ఉన్నారు.