ఎవరిపైనయినా నిఘా పెట్టేందుకు పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారం అప్పగిస్తూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల కేంద్రం ఇచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఐటి చట్టం కింద పది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎవరి కంప్యూటర్నైనా హాకింగ్ చేయవచ్చు. అందుక సహకరించని సర్వీసు ప్రొవైడర్లకు ఏడేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఈ ఉత్తర్వు వీలు కల్పిస్తుంది.
ఈ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఆరు వారాల్లో స్పందన దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది.
కేంద్రం గత డిసెంబర్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తులు, సంస్థల కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు అధికారం పొందిన కేంద్రప్రభుత్వ సంస్థలు.
- ఇంటలిజెన్స్ బ్యూరో
- నార్కోటిక్స్ నియంత్రణా సంస్థ
- ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్
- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు
- డైరక్టర్ట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్
- సిబిఐ
- జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)
- రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా)
- డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటలిజెన్స్
- ఢిల్లీ పోలీస్ కమిషనర్