కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎన్ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు సంబంధించి ఇంకా నిర్వహించని పరీక్షలను రద్దు చేసే విషయాన్ని పరిశీలించాలని సుప్రీం కోర్టు ఈ బోర్డును కోరింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్కులు కేటాయించాలని సూచించింది. పదవ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల విషయంలో సుప్రీం కోర్టు తాజాగా ఈ సూచనలు చేయడం విశేషం.
జస్టిస్ ఎఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు సూచన చేసింది. వచ్చే మంగళవారం నాటికి ఏ సంగతి తెలియచేయాలని ఆదేశించింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ సూచనలు చేసింది. జూలై 1-15 మధ్య సీబీఎస్ఈ, మిగతా పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలనూ రద్దు చేశారు. ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించడం సరికాదని పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు.