ఢిల్లీ: ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ అభియోగంపై క్రికెటర్ శ్రీశాంత్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) విధించిన జీవిత కాల నిషేధాన్నిశుక్రవారం సుప్రీం కోర్టు ధర్మాసనం తొలగించింది. బిసిసిఐ క్రమశిక్షణా కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుబట్టింది. శ్రీశాంత్పై జీవితకాల నిషేధం నిర్ణయాన్ని మూడు నెలల్లో పునః సమీక్షించుకోవాలని పేర్కొంది.
శ్రీశాంత్కు విధించగల శిక్షను బిసిసిఐ తాజాగా నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. శిక్ష నిర్ణయించేముందు శ్రీశాంత్ వాదన వినాలని కోర్టు స్పష్టం చేసింది. తనను కోర్టు నిర్దోషిగా ప్రకటింనందున తనకు అసలు శిక్షే విధించరాదన్న శ్రీశాంత్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఆశోక భూషణ్-జస్టిస్ కేఎమ్ జోసెఫ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శ్రీశాంత్పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
2013 లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపిఎల్లో ఆడిన శ్రీశాంత్, అతని జట్టు సభ్యులు అంకిత్ చావన్, అజిత్ చండీలాను స్పాట్ ఫిక్సింగ్ గ్ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బిసిసిఐ వీరిపై నిషేధం విధించింది.
ఫిక్సింగ్ ప్రమేయంపై సరైన ఆధారాలు లేకపోవటంతో 2015లో ఢిల్లీ కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ బిసిసిఐ మాత్రం నిషేధాన్ని తొలగించలేదు. దీంతో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ నిషేధం వెంటనే ఎత్తివేయాలని 2017, ఆగస్టు 7న బిసిసిఐని ఆదేశించింది. సింగల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అక్టోబర్ నెలలో బిసిసిఐ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ శ్రీశాంత్పై నిషేధం కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
సుప్రీం కోర్టు తీర్పు పట్ల శ్రీశాంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ బిసిసిఐపై నాకు నమ్మకం ఉంది. బిసిసిఐ అధికారులు తనపై నిషేధాన్ని ఎత్తివేస్తే మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.