సుప్రీం కోర్టులో గురువారం ఒక అసాధారణ సన్నివేశం చోటు చేసుకుంది. వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన ఒక కేసులో జస్టిస్ రోహింటన్ నారిమన్ ఇచ్చిన ఆదేశాలను మార్చినందుకు గాను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇద్దరు కోర్టు అధికారులను అక్కడికక్కడే డిస్మిస్ చేశారు.
అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సంస్థపై టెలికాం కంపెనీ ఎరిక్సన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. తమకు చెల్లించాల్సిన 550 కోట్ల రూపాయల బకాయిలు రిలయెన్స్ కమ్యూనికేషన్స్ చెల్లించక పోవడంతో ఎరిక్సన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
గత జనవరిలో జస్టిస్ నారిమన్ ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ అనిల్ అంబానికి నోటీసులు జారీ చేశారు. అయితే సుప్రీం కోర్టు వెబ్సైట్లో అనిల్ అంబానీకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఎరిక్సన్ కంపెనీ న్యాయవాదులు ఈ తప్పును కోర్టు దృష్టికి తీసుకురావడంతో దానిని సరి చేశారు. కోర్టుకు హాజరు కావాల్సిందిగా అనిల్ అంబానీ, ఇతరులను ఆదేశించారు. నిన్న ఈ కేసులో తీర్పు వాయిదా వేశారు. జస్టిస్ నారిమన్ ఫిర్యాదుపై ప్రధాన న్యాయమూర్తి కోర్టు అధికారులపై తన అసాధారణ అధికారాలను ఉపయెగించి చర్య తీసుకున్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ హోదా అధికారులైన ఇద్దరు కోర్టు మాస్టర్స్ తపన్ కుమార్, మానవ్ శర్మలను డిస్మిస్ చేశారు. ఇది ఇంతటితో ముగిసిపోలేదనీ, విచారణ కొనసాగుతుందనీ ఒక సుప్రీం కోర్టు అధికారి చెప్పినట్లు స్క్రోల్ వెబ్సైట్ వెల్లడించింది.