అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో హైకోర్టు శాశ్వత భవన భవన సముదాయాలకు ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతం నేలపాడు వద్ద న్యాయ నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తదితర ప్రముఖులతో కలిసి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ భూమిపూజ చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్వాంగ సుందరంగా నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
హైకోర్టు భవన నిర్మాణ విశేషాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎన్వి రమణ, లావు నాగేశ్వరరావు, ఆర్ సుభాష్ రెడ్డి, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి రాధాకృష్ణన్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సుమారు 4.2ఎకరాల విస్తీర్ణంలో 173కోట్ల రూపాయల వ్యయంతో 2.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జి ప్లస్ టులో జ్యూడిషియల్ కాంప్లెక్స్ను నిర్మించారు.
బౌద్ధ దేవాలయ శైలి ఉట్టిపడేలా టీమ్ వన్ సంస్థ జూడీషియల్ కాంప్లెక్స్కు అధ్బుతమైన డిజైన్ రూపొందించింది. ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. జ్యూడిషియల్ కాంప్లెక్స్లో న్యాయమూర్తుల కోర్టు హాళ్లను 1240 చదరపు అడుగులు, ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలు 2480 చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కాంప్లెక్స్లో 23 కోర్టు హాళ్లు, అనుబంధ కార్యాలయాలు, అడ్వకేట్ జనరల్ ఛాంబర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదుల అసోసేయేషన్ హాలు, మహిళలకు ప్రత్యేకంగా అసోసియేషన్ హాలు, అడ్వకేట్ చాంబర్, వివిధ పరిష్కార కేంద్రాలు, లైబ్రరీతో పాటు కోర్టుకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు.
450 ఎకరాల్లో 819 కోట్ల రూపాయల వ్యయంతో న్యాయనగరంలో హైకోర్టు శాశ్వత భవనాలు, న్యాయమూర్తుల నివాసాలు, ఇతర క్వార్టర్స్ నిర్మాణాలు జరగనున్నాయి.