Supreme Court: దేశంలో అత్యంత పేరుగాంచిన దర్యాప్తు సంస్థల్లో ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ). అయితే దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల నుండి సీబీఐ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ఆ వ్యవస్థ ప్రతిష్ట మసకబారింది అన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో సీబీఐకి ఏదైనా క్రిటికల్ కేసును ఇస్తున్నారు అంటే ఒక నమ్మకం ఉండేది. ఈ కేసు ఇక తేలిపోయినట్లే అని భావించే వారు. కానీ ఇప్పుడు సీబీఐ చేతికి కేసులు వెళుతుంటే నెలలు, సంవత్సరాల తరబడి దర్యాప్తు కొనసాగిస్తుండటంతో పాటు కేసు పక్కదారి పట్టిస్తారేమో అన్న భయంతో సీబీఐ కంటే రాష్ట్ర పోలీస్ దర్యాప్తు బెటరేమో అన్న అభిప్రాయం కూడా వస్తోంది. సీబీఐ అపఖ్యాతి, అప్రతిష్ట మూటగట్టుకుంది. అటువంటి సీబీఐని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గుర్తించారు. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయిన తరువాత దేశంలోని ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే సీబీఐ, ఈడీ, పోలీస్ వ్యవస్థల పనితీరుపై కీలక వ్యాఖ్యలు కూడా జస్టిస్ వెంకట రమణ చేశారు. సీబీఐ ఏదైనా కేసులో చార్జీషీట్ దాఖలు చేయాలంటే సంవత్సరాల తరబడి చేస్తోందని, సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నారు అంటూ గతంలో సీబీఐ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు కూడా సుప్రీం కోర్టు సీబీఐ పని తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ పని తీరు పట్ల దేశం మొత్తంగా ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాల హైకోర్టులు కూడా సీబీఐ పని తీరును తప్పుబడుతున్నాయి. అందుకే దేశంలో సీబీఐ పని తీరు ఎలా ఉంది ?. మీ చేతిలో ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి ?. ఆ కేసుల తాజా పరిస్థితులు ?,. సిబ్బంది కొరత సమస్య ఏమైనా ఉందా తదితర విషయాలపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఎన్ని కేసులు నమోదు చేసింది ? ఎన్ని కేసుల్లో నేరం నిరూపణ అయ్యాయి ?. మౌలిక సదుపాయాల కొరత ఏమైనా ఉందా ?, ఉంటే ఆ ఇబ్బందులు తదితర అంశాలతో పూర్తి నివేదికను ఆరు వారాల్లో అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతంలో మద్రాస్ హైకోర్టు సీబీఐ పనితీరుపై చేసిన కీలక వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఉదహరించింది. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఉండాలి కానీ వత్తిళ్లకు గురి కాకూడదనీ, సీబీఐ ఎందుకు ఇలా పని చేస్తుందో అర్థం కావడం లేదు, పనితీరు అధ్వాన్నంగా ఉందని చెబుతూ సీబీఐని పంజరంలో ఉన్న చిలుకతో మద్రాస్ హైకోర్టు పోల్చింది. పంజరంలో ఉన్న చిలుకకు స్వేచ్చ కావాలి అంటూ స్వేచ్చను సీబీఐ తానంతట తానే తీసుకుని స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు అప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆ వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ప్రస్తావిస్తూనే సీబీఐపై వస్తున్న విమర్శలకు సీబీఐనే సమాధానం ఇవ్వాలనీ, సీబీఐ ఎందుకు పనితీరు మెరుగుపర్చుకోలేకపోతుంది, సీబీఐ చేపట్టిన కేసులు ఎందుకు కోర్టులో నిలబడలేకపోతున్నాయి ?. ఇప్పటి వరకూ సీబీఐ చేపట్టిన ఎన్ని కేసులు నిలబడ్డాయి ?. ఎన్ని కేసుల్లో చతికల పడ్డాయి ?, ఎన్ని హత్య కేసులు దర్యాప్తు చేస్తున్నారు ?. ఎన్ని ఆర్థిక నేరాల కేసులు దర్యాప్తు చేస్తున్నారు ?.ఇవన్నీ కూడా స్పష్టంగా నివేదిక రూపంలో తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జమ్ముకశ్మీర్ కు సంబంధించి ఇద్దరు న్యాయవాదులను అరెస్టు చేయడం, వారిపై బలవంతంగా ఆరోపణలు చేసి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజానికి సీబీఐ పనితీరుపై విమర్శలు వస్తుండటం, ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ప్రస్తావన చేయడంతో ఒక రకంగా సీబీఐపై వత్తిడి నెలకొంది.
సీబీఐ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేసే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న దర్యాప్తు సంస్థ. కానీ స్వయం ప్రతిపత్తి కాస్తా హోంశాఖ పరిధిలోకి, ఆ రాజకీయ నేతల పరిధిలోకి వెళ్లిపోయింది. సో..ఇప్పుడు సీబీఐ పనితీరు మార్చుకుంటుందా ? లేదా కాస్త అయినా ప్రక్షాళన జరుగుతుందా ? లేదా లేక సుప్రీం కోర్టే జోక్యం చేసుకుని ప్రక్షాళన చేస్తుందా ? అనేది వేచి చూడాలి. ఎందుకంటే సీబీఐకి ఏపికి అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో పలు కీలకమైన కేసులను సీబీఐ ఛేదిస్తోంది. కానీ నమ్మకం కోల్పోయింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ ఎప్పుడో చేపట్టింది. సంవత్సరం దాటింది. గడచిన నాలుగు నెలల నుండి సీబీఐ కడప, పులివెందులలో ఉండి విచారణ చేస్తుంది కానీ కీలక నిందితులు ఎవరినీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. గుండెపోటు అని చెప్పిన వారిని ఇంత వరకూ ప్రశ్నించనేలేదు. ఇటువంటి అనుమానాలు సీబీఐ మీద నెలకొన్నాయి. సీబీఐని సుప్రీం కోర్టు ఎంత మేర ప్రక్షాళన చేస్తుందో చూద్దాం.