(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఇంగ్లీషు మాధ్యమం అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విద్యాబోధన అమలు చేసేందుకు ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వులను ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డె నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను విచారించింది.
ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాధ్ వాదనలు వినిపించారు. పేద విద్యార్థుల కోసం ఏపి ప్రభుత్వం ఇంగ్లీషు మాధ్యమాన్ని తీసుకువచ్చిందనీ, 90 శాతం మంది పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నారనీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఏపి ప్రభుత్వ న్యాయవాది వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఇతర దేశాలలో ఇంగ్లీషు మీడియంతో పాటు మాతృభాషలో విద్యాబోధన కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ గణాంకాల ఆధారంగా ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేమని అన్నారు. ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని జస్టిస్ బొబ్డె అభిప్రాయపడ్డారు. పునాది గట్టిగా ఉంటే విద్యార్థులు ఏ భాషలోనైనా అలవోకగా రాణిస్తారని పేర్కొన్నారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?