సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి సీబీఐచే కేసు విచారణ జరిపించాలని వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) సుప్రీం కోర్టు కొట్టివేసింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ ప్రమేయం అవసరం లేదని తెలిపింది. కాగా పిల్ వేసిన అల్కా ప్రియా అనే లాయర్ మాట్లాడుతూ.. సుశాంత్ చిన్నారులకు నాసాలో ట్రెయినింగ్ ఇప్పించేందుకు ఎంతో సహకరించాడని, ఎన్నోసామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాడని, కనుక అతని ఆత్మహత్య కేసును సీబీఐచే విచారణ జరిపించాలని కోరారు.
సుప్రీం కోర్టు సదరు లాయర్ వాదనకు స్పందిస్తూ.. సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చింది. సుశాంత్ మంచి వ్యక్తే కావచ్చు, అయినా అందులో సీబీఐ విచారించాల్సిన పని లేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ బోబ్డే సదరు పిల్ను కొట్టేశారు. కాగా దేశవ్యాప్తంగా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వేసిన పిల్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఇక ఇదే విషయంపై ఇప్పటికే మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని, ముంబై పోలీసులు కేసును చక్కగానే దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసు విషయమై 40 మందిని విచారించి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారని, నిందితులు ఎవరైనా ఉంటే కచ్చితంగా అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం శిక్షిస్తారని అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?