ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను న్యాయమూర్తి తిరస్కరించారు. వైఎస్ జగన్మోహనరెడ్డిని సీఎం పదవి నుండి తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్దంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొన్నది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ కొట్టివేసింది.
సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా అనేది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలోని అంశమని ధర్మాసనం పేర్కొన్నది. సీఎం పదవి నుండి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని స్పష్టం చేస్తూ లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని తెలిపింది. దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ఒక్కటి మాత్రమే విచారణలో ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గత నెలలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ వెంకట రమణ ఏపి హైకోర్టును తీర్పులను ప్రభావితం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలను ప్రభుత్వ సలహాదారు అజయ్ కలాం మీడియాకు వెల్లడించడంతో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే.