తెలంగాణ బాణా సంచా వ్యాపారులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణలో బాణాసంచా విక్రయాలను నిషేదిస్తూ హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రస్తుత కరోనా నేపథ్యంలో క్రాకర్స్ కాల్చకుండా ఉండటం మంచిది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ క్రాకర్స్ విక్రయాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రాకర్స్ బ్యాన్ ను ప్రభుత్వం అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బాణా సంచా దుకాణాలను మూసివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పండుగను పురస్కరించుకుని లక్షలాది రూపాయల టపాసులను దుకాణాల్లో సిద్ధం చేశామనీ, ఇప్పుడు అర్ధాంతరంగా దీపావళి పండుగకు రెండు రోజుల క్రాకర్స్ అమ్మకాలపై బ్యాన్ విధించడం వల్ల కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుందనీ, తమకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నది క్రాకర్స్ అసోసియేషన్.
ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్ క్రాకర్స్కు అనుమతి ఇచ్చింది. నేషనర్ గ్రీన్ ట్రెబ్యునల్ (ఎన్జీటీ) అదేశాలు అమలు చేయాలని స్పష్టం చేసింది. దీపావళి పండుగ రోజు రెండు గంటల పాటు క్రాకర్స్ కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకూ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి మంజూరు చేసింది.