(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో ఎన్జీటీ సుమోటాగా కేసు తీసుకోవడంపై ఎల్ జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్ జీ టీలో కేసు విచారణ నవంబర్ మూడవ తేదీ ఉందని ధర్మాసనం దృష్టికి న్యాయవాది రోహత్గి తెలిపారు. ఎన్ జి టీలో కమిటీ నివేదికపై అభ్యంతరాలు సమర్పించాలని ఎల్ జీ పాలిమర్స్ను సమర్పించాలన ధర్మాసనం ఆదేశించింది. పది రోజుల్లో నివేదికపై అభ్యంతరాలు సమర్పించాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎన్ జీ టీ కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
విశాఖ పాలిమర్స్లో ఈ ఏడాది మే నెలలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12మంది మృతి చెందగా దాదాపు 250 మందికిపైగా అస్వస్థతకు గురైయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల వంతున ఎక్స్ గ్రేషియా చెల్లించింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఎన్ జి టీ సుమోటాగా ఎల్ జి పాలిమర్స్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.