మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) దారుణ హత్య జరిగి మూడేళ్లు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో నిందితుల అరెస్టు జరగలేదు. హత్యలో నేరుగా భాగస్వాములైన వారిని అరెస్టు చేసినట్లుగా సీబీఐ పేర్కొంటున్నా వివేకా హత్య కేసులో కుట్రదారులను అరెస్టు చేయలేదు. దర్యాప్తులో ప్రగతి లోపించిన నేపథ్యంలో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణ ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సీబీఐ అధికారుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, సాక్షులను బెదిరిస్తున్నారంటూ సునీతా రెడ్డి గతంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి విచారణ .. ఏపి హైకోర్టు పరిధిలో కాకుండా, తెలంగాణ హైకోర్టు పరిదిలో జరపాలని ఆమె కోరారు.
ఈ పిటిషన్ పై జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ కృష్ణ మురారిల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరపగా, సునీతారెడ్డి తరపున న్యాయవాది సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు విచారణ ఎలాంటి పురోగతికి నోచుకోని పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు వివరించారు. విచారణకు తోడ్పాటు అందించాలని ఏపి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటిక దిగువ స్థాయి పోలీసులు యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికార వర్గాలు కానీ సహకరించడం లేదని తెలిపారు. నిందితులు ఒక్కొక్కరు బెయిల్ పై బయటకు వస్తూ సాక్షులను బెదిరిస్తున్నారని వివరించారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం .. సీబీఐకి, ఏపి సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి వివరాలు తెలియజేయాలని నోటీసులో ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం ..! సుప్రీం కోర్టును ఆశ్రయించిన సీబీఐ ..ఎందుకంటే..?