ఢిల్లీ, ఫిబ్రవరి 7: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా పని చేసిన ఎం. నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ అయ్యింది. బీహార్లో ప్రభుత్వ అనాధాశ్రమాలలోని పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరక్టర్ ఎ.కె. శర్మను బదిలీ చేసినందుకు ఈ నోటీసు జారీ అయింది.
శర్మను బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. బీహార్ కేసును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా శర్మ బదిలీ అయినట్లు ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శర్మ బదిలీకి అప్పటి తాత్కాలిక డైరక్టర్ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ప్రాసిక్యూటర్ భాసురన్ను బాధ్యులుగా గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి, ‘మీరు మా ఆదేశాలతో ఆటాడుకున్నారు. దేవుడే మిమ్మల్ని రక్షించాలి’ అన్నారు. కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేస్తూ ఈ నెల 12న వ్యక్తిగతంగా హజరుకావాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మను బదిలీపై పంపి నాగేశ్వరావును తాత్కాలిక డైరక్టర్గా నియమించినపుడు ఈ బదిలీలు జరిగాయి. శర్మతో పాటు, సిబిఐ స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానా మీద వచ్చిన ఆభియోగాలపై దర్యాప్తు చేస్తున్న మరో అయిదుగురు అదికారులను కూడా నాగేశ్వరరావు బదిలీ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశానుసారం తిరిగి తన స్థానానికి వచ్చిన అలోక్ వర్మ ఆ బదిలీలను వెంటనే రద్దు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీ ఒక్క రోజులో వర్మను మళ్లీ బదిలీ చేసి తిరిగి నాగేశ్వరరావును తాత్కాలిక డైరక్టర్గా నియమించగానే, ఆయన ఎ.కె.శర్మతో సహా ఆ ఆరుగురు అధికారులకూ మళ్లీ స్థానచలనం కల్పించారు.