న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందనీ, ఆయనపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలు అందులో భాగమేననీ పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాది ఉత్సవ్ బైన్స్కు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసు జారీ చేసింది. అఫిడవిట్పై బుధవారం విచారణ చేపడతామని ప్రకటించింది.
సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఒకరు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దానితో కోర్టుకు సెలవు రోజు అయినప్పటికీ శనివారం నాడు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొ గోయ్ తన స్వీయ నేతృత్వంలోనే మరో ఇద్దరు న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేసి లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టారు.
ఆ విచారణలో ప్రధాన న్యాయమూర్తి తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆ మహిళకు నేర నేపధ్యం ఉందని ఆరోపించారు. తర్వాత తాను ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వనని పేర్కొన్నారు. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తుల తరపున జస్టిస్ అరుణ్ మిశ్రా జారీ చేసిన ఉత్తర్వులో, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని మీడియా విచక్షణతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఉత్సవ్ బైన్స్ అఫిడవిట్పై విచారణ చేపట్టింది. ఈ విషయంలో ఏది ఎలా జరిగిందీ తనకు తెలుసుననీ, కుట్రలో పాత్రధారులెవరన్నది సీల్డ్ కవర్లో సమర్పించగలననీ బైన్స్ తన అఫిడవిట్లో పేర్కొన్నాడు. ఈ అంశాలపై బుధవారం కోర్టులో వివరణ ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆయనను ఆదేశించింది.