ఏపి రాజధాని అమరావతికి సంబంధించిన వివాదంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. నవంబర్ 1వ తేదీన పిటిషన్ విచారణను చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆదేశాల మేరకు అమరావతి పై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు నవంబర్ 1న లిస్ట్ చేస్తూ కోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది.
ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ఆరు నెలల క్రితం ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోగా రాజధాని అభివృద్ధి పనులు చేపట్టాలని, ఒప్పందం ప్రకారం ప్లాట్ లను అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్ లో కోరింది. అయితే నెలల గడుస్తున్నా పిటిషన్ విచారణకు రాకపోవడంతో ఏపి ప్రభుత్వం ఇటీవల ఆ పిటిషన్ ను త్వరితగతిన విచారణ జరిగేలా చూడాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కు లేఖ కూడా రాసింది. ఈ క్రమంలోనే పిటిషన్ పై విచారణకు అనుమతి మంజూరు చేస్తూ విచారణ తేదీని కూడా ప్రకటించింది. ఈ పిటిషన్ పై జరిగే విచారణలో తమ వాదనలు కూడా వినాలని అమరావతి రైతు పరిరక్షణ సమితి కేవియట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
TS High Court: జగన్ అక్రమార్కుల కేసులో ఇండియా సిమెంట్స్ కు బిగ్ రిలీఫ్ .. ఆ విశ్రాంత అధికారి షాక్