దేశంలోని రుణ చెల్లింపుదారులకు తాత్కాలికంగా ఊరట లభించింది. నిరర్థక ఆస్తుల ప్రకటనతోపాటు మారటోరియంపై కొనసాగుతున్న విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు గాను అయ్యే వడ్డీ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని బ్యాంకులు, ఆర్బీఐ గతంలో రుణ గ్రహీతలకు చెప్పిన విషయం విదితమే. అయితే దీనిపై సుప్రీంలో పలువురు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు తాము చెప్పే వరకు ఆ విషయంపై నిర్ణయం తీసుకోకూడదని సెప్టెంబర్ 3న ఆదేశాలు జారీ చేసింది. తరువాత ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సెప్టెంబర్ 28వ తేదీ వరకు వాయిదా వేసింది.
మారటోరియం సమయంలో వాయిదా తీసుకున్న ఈఎంఐలకు వడ్డీ చెల్లించాల్సిందేనని కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకుల తరఫున లాయర్లు సుప్రీంలో వాదించారు. అయితే కరోనా లాక్డౌన్ వల్ల రుణ గ్రహీతలు ఈఎంఐలను చెల్లించేందుకే ఇబ్బందులు పడ్డారని, అందువల్ల వారు భారీగా పెరిగే వడ్డీని ఎలా చెల్లిస్తారని వారి తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు జరిపారు. అయితే ఆ వడ్డీని మాఫీ చేయడం నిబంధనలకు విరుద్ధమని, అలాగే రుణాలను మారటోరియం సమయంలోనూ చెల్లించిన ఇతరులకు దీని వల్ల అన్యాయం జరుగుతుందని మరోవైపు బ్యాంకుల తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో చెప్పారు. అయితే అన్నిపక్షాల వాదనలను విన్న జస్టిస్లు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాల ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
అలాగే ఈ నెల 28వ తేదీ వరకు డిఫాల్టర్ల ఖాతాలను ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)లుగా ప్రకటించవద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక అదే తేదీన.. ఈఎంఐ వాయిదా తీసుకున్న కాలానికి వడ్డీ చెల్లించే విషయమై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని తెలిసింది. అలాగే కరోనా నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలకు లోనవుతున్న వారికి మరో రెండేళ్ల పాటు రుణాల పునర్ వ్యవస్థీకరణ కింద మారటోరియం సదుపాయాన్ని కల్పించే విషయమై కూడా కోర్టు అదే రోజు తీర్పు ఇస్తుందని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?