ఢిల్లీ, జనవరి 24: ఎస్సి, ఎస్టిపై అత్యాచారాల నిరోధక చట్టం సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఎస్.సి, ఎస్.టి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఇచ్చేందుకు వీలు లేకుండా గత ఆగస్టులో పార్లమెంటు చట్టానికి సవరణ చేసింది. దానిని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లనూ, కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్నూ కలిపి విచారిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎకె సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ల విచారణను కొత్త ధర్మాసనానికి అప్పగించాల్సిందిగా కోరుతూ జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. జస్టిస్ యు.యు. లలిత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం గత సంవత్సరం మార్చిలో ఎస్.సి, ఎస్.టి చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వోద్యోగులపై ఈ చట్టం ప్రయోగించినపుడు వెంటనే అరెస్టులు చేయనక్కర లేదని ఆ తీర్పు పేర్కొంటున్నది. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తడంతో మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు అమలు కాకుండా చట్ట సవరణలు చేసింది. దీనిని సవాలు చేస్తున్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా గురువారం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.