కోల్కతా పోలీసు కమిషనర్ ప్రసాద్ కుమార్ సిబిఐతో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్కతా వివాదంపై సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రసాద్ కుమార్ను సిబిఐ అరెస్టు చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య యుద్ధంగా పరిణమించిన ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలను మమత తన నైతిక విజయంగా చెప్పుకున్నారు. సిబిఐ అధికారులకు తన ప్రభుత్వం వ్యతిరేకం కాదని, సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఆమె తాను దీక్ష చేస్తున్న చోటనుంచే ప్రకటించారు.
కమిషనర్ ప్రసాద్ కుమార్ను కోల్కతాలో కాకుండా షిల్లాంగ్లో విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ రోజు విచారణలో, పోంజీ కుంభకోణాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలూ పోలీసులూ కుమ్మక్కయ్యారని సిబిఐ ఆరోపించింది. ప్రసాద్ కుమార్పై వారెంట్ లేని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది.
ఫశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, కోల్కతా పోలీసు కమిషనర్లపై దాఖలయిన కోర్టు ధిక్కారం పిటిషన్పై ధర్మాసనం వారికి నోయీసులు జారీ చేసింది. సమాధానం దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కేసు విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు ప్రసాద్ కుమార్ ధర్మాసనం ముందు హాజరు కావాలని పేర్కొన్నది.