తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చుట్టూ ఇటీవల వివాదాలు ముసురుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఆమె వరుసగా వివిద అంశాల్లో టార్గెట్ చేయబడుతున్నారు.
తాజాగా అప్పు ఇప్పిస్తే తిరిగి ఇవ్వకుండా తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సందీప్ సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీదేఇవి టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నారు.
వాళ్లేమంటున్నారంటే…
పేకాట క్లబ్ నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి పై చర్యలు తీసుకోవాలి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. “వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు కుటుంబ సభ్యులు పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న విషయం సాక్ష్యాధారాలతో సహా బహిర్గతమైన విషయం మర్చిపోకముందే తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో ఉదంతం ఆధారాలతో బయటకు వచ్చింది. వైసీపీ నాయకులు చేత పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి అనర్హురాలు. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న శ్రీదేవి ఆడియో క్లిప్పింగ్స్ పై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలి. పేకాట క్లబ్ లు నిర్వహించమని స్వయంగా ఎమ్మెల్యేనే ఆదేశాలు జారీ చేయడంపై ముఖ్యమంత్రి స్పందించాలి“ అని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే గారి మాట ఇది
మరోవైపు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనపై జరుగుతున్న ప్రచారం, ఆరోపణలపై స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియోలో వాయిస్ తనది కాదని ఆమె తేల్చి చెప్పారు. “నా వాయిస్ను మార్ఫింగ్ చేసి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు“ అంటూ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. “సందీప్, సురేష్లు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందని సస్పెండ్ చేశాం. నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సందీప్, సురేష్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. నిజంగా అది నా వాయిస్ అయితే నేరుగా పోలీసులకు ఇవ్వాలి.“ అని ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. సందీప్, సురేష్ వెనుక ఓ నేత ఉండి నడిపిస్తున్నాడని, ఆ నేతపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.