తీవ్ర వ్యసనంగా మారి విద్యార్థులతో పాటు అన్ని వయస్సుల వారి భవిష్యత్తు నాశనానికి కారణం అవుతున్న ఆన్లైన్ గేమ్ ‘పబ్జి’ నిషేదానికి సూరత్ జిల్లా పరిపాలనా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్ ద్వారా అడే పబ్జీ గేమ్కు ఎక్కువ మంది విద్యార్థులు ఆకర్షితులు అవుతున్నారు. ఈ గేమ్లో పడి చాలా మంది తన దైనందిక జీవితంలో సమయానుకూలంగా చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. పక్కన ఉన్న వారిని సైతం పట్టించుకునే పరిస్థితి లేదు. పబ్జి మాయలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. ఈ గేమ్కు బానిసలు అవ్వద్దంటూ పలువురు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ గేమ్ పల్ల పలు దుర్ఘటనలు కూడా జరిగాయి.
ఇటీవల జమ్ములో వ్యాయమ శిక్షకుడు పబ్జి గేమ్ ఓడిపోవడంతో ఆవేశాన్ని తట్టుకోలేక తనకు తాను గాయపర్చుకున్నాడు. విద్యార్థులు, యువత దీనికి బానిస అయి హింసాత్మక ప్రవర్తన పెరగడంతో పాటు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు.
జమ్ముకాశ్మీర్ విద్యార్థి యూనియన్ ఈ గేమ్పై నిషేదం విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కోరింది. గుజరాత్ ప్రభుత్వం కూడా దీనిపై ఆంక్షలు విధించింది. పబ్జి గేమ్ నిషేదించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఆదేశించింది.
ఒక విద్యార్థి ఈ గేమ్ను నిషేదించాలని కోరుతూ ముంబాయి హైకోర్టును కూడా ఆశ్రయించాడు.
గుజరాత్ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ జాగృతి పాండ్యా రాష్ట్రంలోని పబ్జీ గేమ్ను నిషేధించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరారు.
పబ్జి ఆటపై నిషేదం అమలు చేయాల్సిన అవసరం ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సిపిసిఆర్) అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేసిందని జాగృతి పాండ్యా ఒక జాతీయ మిడియాకు తెలిపారు.