తెలంగాణలో ఇప్పుడు అంతా ఎన్నికల సందడి. ఇప్పటికే నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నిక పూర్తవడం, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తదుపరి ఎన్నికలపై దృష్టి పెడుతున్నాయి.
అయితే, ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. తమ వ్యూహాత్మక కృషితో తెలంగాణ సీఎం కేసీఆర్కు షాకివ్వనున్నట్లు ఆ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ఏం చేస్తోందంటే….
దుబ్బాక ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంత కలిసికట్టుగా పని చేసినట్లుగానే.. గ్రేటర్ ఎన్నికల్లోనూ దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యనేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్లో డివిజన్ల వారిగా తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ… పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది కాంగ్రెస్ . ఇప్పటికే డివిజన్ల పరిధిలో వివిధ విభాగాలకు చెందిన కమిటీల ఏర్పాటు పూర్తి చేసిన కాంగ్రెస్ నేతలు … ఇంకా పెండింగ్ ఉన్న కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు పార్టీ డివిజన్ ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహిస్తూ… ఎన్నికల సందర్భంగా స్థానికంగా పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి కొత్త టార్గెట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆయన పార్టీని టార్గెట్ చేయడంలో ముందుండే మల్కాజ్ గిరి లోక్సభ సభ్యుడు , కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ క్రమంలో క్రియాశీలంగా ముందుకు సాగుతున్నారు. నియోజక వర్గం పరిధిలోని నగరపాలక సంస్థల డివిజన్ల పార్టీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థులు ఎవరనేది పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా కృషి చేసి గెలిపించాలని రేవంత్ సూచించారు. అన్ని డివిజన్లకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో సమీక్ష లు నిర్వహిస్తూ స్థానికంగా ఏలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్న అంశంపై సలహాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సర్వే చేసుకుని.. బలమైన అభ్యర్థి ఎవరో గుర్తించి వారికి టికెట్ ఇస్తామని, తన నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఖాయమని రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.