హోరాహోరీగా సాగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు.
ఉత్కంఠభరితంగా సాగిన ఫలితాల వెల్లడి ప్రక్రియలో బీజేపీ నేత రఘనందన్ రావు గెలుపొందారు. అయితే, ఈ గెలుపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖాతాలో చేరిందంటున్నారు.
దుబ్బాకలో దూకుడు
తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమలనాథులు… దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సమరంలో పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అప్పటికి సంజయ్ సారథిగా రాలేదు. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఏ మేరకు సత్తా చాటుతారో అనే చర్చలు , టీఆర్ఎస్ ఎత్తుగడల నేపథ్యంలో సంజయ్ ఎన్నికల వ్యూహానికి తొలిపరీక్షగా నిలిచింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.
అమిత్ షా ఎంట్రీ
దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులంతా సమష్టిగా పోరాడి దుబ్బాకలో విజయం సాధించినందుకు షా అభినందనలు తెలియజేశారు. దుబ్బాక ఎన్నికల వేళ బండి సంజయ్పై దాడి సమయంలోనూ షా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్ సైతం …
మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని బండి సంజయ్ ఖాతాలో వేశారు. దుబ్బాకలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి శుభాబినందనలు తెలుపుతున్నాను అని ప్రకటన విడుదల చేశారు. “బీజేపీ, ఆ పార్టీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం దుబ్బాకలో ఈ విజయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ శాఖ నాయకత్వ పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి నేటి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ నేటి విజయానికి మార్గం వేసింది. పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఆయన ఈ విజయాన్ని సాధించారు. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను“ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే పదవి పొందింది రఘునందన్ రావు అయితే విజయం సాధించింది బండి సంజయ్ అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.