ఏపీలో రాజకీయం గరంగరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలతో రాజకీయం హాట్ హాట్గా మారుతున్న సమయంలో ఓ ఇద్దరు ఎంపీల రాజీనామా అంశం తెరమీదకు వచ్చింది.
ఏపీలో కీలకంగా మారిన అమరావతి రాజధాని విషయంలో తాజాగా జనసేన పార్టీ సంచలన డిమాండ్ చేసింది.
రాజధాని ప్రాంతంలో
ఇటీవల ప్రభుత్వం అరెస్టు చేసిన రాజధాని రైతులను పరామర్శించేందుకు జనసేన పార్టీ నేతలు గుంటూరు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. అనంతరం కృష్ణాయపాలెం, మందడం, అనంతవరం, రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో రాజధాని రైతుల నిరసన శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఛలో గుంటూరు సందర్భంగా జరిగిన లాఠీఛార్జ్ లో గాయపడిన మహిళలను, అరెస్టు అయిన రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతం నుంచే ప్రజా తీర్పు కోరుదామని కోరుతూ బాపట్ల, గుంటూరు ఎంపీలు రాజీనామా చేయండి అని పిలుపునిచ్చారు. దానికి తగుగ కారణాలు సైతం వారు వెల్లడించారు.
ఎంపీల రాజీనామాతో ఏం జరుగుతుందంటే….
పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రంలోనూ కదలిక వస్తుందని జనసేన నేతలు పేర్కొన్నారు. “మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న బాపట్ల ఎంపి నందిగం సురేష్, వ్యతిరేకిస్తున్న గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ఇద్దరు రాజీనామా చేసి రాజధాని ప్రాంతం నుంచే ప్రజా తీర్పు కోరాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి ప్రాంతానికి వ్యతిరేకంగా రైతులను ఇబ్బందిపెట్టే ధోరణిలో వ్యవహరిస్తోంది. బయటి నుంచి వచ్చిన వ్యక్తుల్ని వదిలేసి రాజధాని రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య. రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చారుగానీ, ఓ కులానికో, మతానికో ఇవ్వలేదు. గుంటూరు జైలు వద్ద పోలీసులు అడ్డుకోవడం సరైన పద్దతి కాదు. ములాఖత్ కుదరదు అన్న విషయాన్ని సూపరిండెంట్ గారు చెప్పాలి. రోడ్డు మీదే పోలీసులు అడ్డుకోవడం ఏంటి? ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజధాని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం” అన్నారు.
అమరావతిలో ఆ కులం వారే….
రాజధాని ఓ కులానిది కాదని ప్రభుత్వమే రుజువు చేసిందని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. “రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భూములు ఇచ్చిన రైతులకు కులం అంటగడుతోంది, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రైతులను అరెస్టు చేయడం ద్వారా రాజధాని ఉద్యమం ఒక కులానికి చెందినది కాదని తేలిపోయింది. ఈ ప్రాంతంలో అన్ని కులాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వమే రుజువు చేసింది. భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేయడం అంటే రాష్ట్ర అభివృద్దికి సంకెళ్లు వేయడమే. రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఉంటే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేసేది.“ అని పేర్కొన్నారు.