తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యూహం ఫలించింది. గత కొద్దికాలంగా దూకుడు మీదున్న బీజేపీని ఎలా కట్టడి చేయాలో అలా చేశారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీట్లు భారీగా తగ్గిపోవడంతో … బీజేపీ దూకుడు , టీఆర్ఎస్కు షాకులు అంటూ పలువురు అంచనా వేశారు. అయితే, హఠాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్న కేసీఆర్ కొత్త గేమ్ నడిపించారు. అందులో కేసీఆరే గెలిచారని అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏం జరిగింది?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వాడీవేడిగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది..? పథకాల నుంచి నిధుల వరకు అనేక ఆరోపణలు చేసుకున్నారు. అవినీతి అంటూ విరుచుకుపడ్డారు కూడా. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపారు. దీనిపై రకరకాల కథనాలు రాగా.. కొందరైతే.. ఇది, బీజేపీ-టీఆర్ఎస్ పొత్తుకు దారితీస్తుందనే విశ్లేషణ కూడా చేశారు. ఈ ప్రచారం నుంచి బీజేపీ తప్పించుకోలేక పోతోంది.
బీజేపీ తప్పించుకోలేక పోతోందిగా…
టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అనే ప్రశ్నలను బీజేపీ ఎదుర్కుంటోంది. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి కి ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఘాటుగా రియాక్టయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వంతో కుస్తీ కొనసాగుతుందని , ఎలాంటి పొత్తు లేదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. బీజేపీ ని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసేలా కేసీఆర్ ఢిల్లీ టూర్ సాగిందని ఆ ఉచ్చులో బీజేపీ ఇరుక్కుందని పలువురు విశ్లేషిస్తున్నారు.