తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు జాతీయ మీడియాలో వార్తల్లో వ్యక్తిగా నిలవనున్నారు. ఒకింత గ్యాప్ తర్వాత ఆయన ఢిల్లీ బాట పట్టనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. శుక్ర , శనివారాలు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు. అయితే, ఈ టూర్ పార్టీ పరమైన అంశమా లేకపోతే ఇటీవలే ఆయన ప్రకటించిన యుద్ధ ఎజెండాలో భాగమా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
గ్రేటర్ ఓటమి తర్వాత….
జీహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయాన్ని బీజేపీ అడ్డుకుంది. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి చెందిన ఢిల్లీ స్థాయినేతలు, మంత్రులు జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ బీజేపీని, ప్రధాని మోడీని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
మోడీ తో మీటింగ్ ఉంటుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఢిల్లీలో ప్రధానితో సహా అనేకమంది మంత్రులను కూడా కేసీఆర్ కలవబోతున్నారు. ఎల్లుండి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పూజ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తరువాత కేసీఆర్ మొదటిసారిగా ఢిల్లీ వెళ్తున్నారు. మరోవైపు రైతుల ఆందోళన సైతం జరుగుతోంది. ఈ ఆందోళనలో కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ఇస్తారా అనేది ఆసక్తికర అంశం.
మోడీకి కేసీఆర్ ప్రేమలేఖ
సీఎం కేసీఆర్ ఢిల్లీలో రైతులను కలిసి ఉద్యమంలో పాల్గొనాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని.. ప్రధానిని కలవనున్నారని సమాచారం అందిందన్నారు. భారత్ బంద్ లో పాల్గొన్న మర్నాడే ప్రధాని మోడీకి.. కేసీఆర్ ప్రేమ లేఖ రాయాల్సిన అవసరం ఏంటని నారాయణ ప్రశ్నించారు.