Omicrone: దేశంలో ఒమైక్రాన్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుండటంతో అది ఒమైక్రాన్ వేరియంట్ అయి ఉండవచ్చని భయాందోళనలు చెందుతున్నారు. దాదాపు ఇప్పటి వరకూ 30 దేశాలలో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇతర దేశాల నుండి వచ్చే వాళ్లకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నా కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఒమైక్రాన్ కేసులకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తికి ఒమైక్రాన్ సోకింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది.
Omicrone: దక్షిణాఫ్రికా నుండి రావడంతో
విషయంలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఒ వ్యక్తి గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుండి వచ్చాడు. అతనికి విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో అతను ఇంటికి వచ్చేశాడు. అయితే అతను ఇంటికి వచ్చిన తరువాత జ్వరం రావడంతో ఈ నెల 5వ తేదీన స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మరో సారి పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే అతను దక్షిణాఫ్రికా నుండి రావడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అతనికి సోకింది ఒమైక్రాన్ అయి ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారులు అతని నుండి సేకరించిన బ్లడ్ సాంపిల్స్ ను హైదరాబాద్ లోని సీసీఎంబీ ల్యాబ్ కు పంపించారు. అక్కడ నుండి నివేదిక రావాల్సి ఉంది. వైద్యుల సూచనల మేరకు సదరు బాధితుడు, అతని కుటుంబ సభ్యులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. దీనిపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ స్పందించారు. ఆ వ్యక్తికి సోకింది ఒమైక్రానా కాదా అనేది నివేదిక వచ్చిన తరువాత తెలుస్తుందని అన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.