విజయవాడలో స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఏకంగా 10 మంది మృతి చెందారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రఖ్యాత రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం స్టార్ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఊహించని పరిణామాలతో జరిగి ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. హైకోర్టులో ఇరు పక్షాలు పిటిషన్ వేశాయి. హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఘటనకు సంబంధించి రమేశ్ హాస్పిటల్స్ ఎండీ రమేష్ బాబు, ఛైర్మన్ సీతారామ్మోహన రావుపై తదుపరి చర్యల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు ఈ కేసు విచారణకు రానుంది.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు ఇవీ..
విజయవాడ రమేశ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లో ఆగస్టు 9న అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై రమేష్ ఆస్పత్రి ఛైర్మన్ సీతారామ్మోహనరావు, ఎండీ రమేష్ బాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ లో భాగంగా స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణకు హైకోర్టు ఆదేశాలు అడ్డుగా ఉన్నాయని.. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. నిజాలు వెలుగులోకి రావాలంటే విచార జరగాలని ప్రాథమిక దశలోనే చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసును జస్టిస్ ఫాలీ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.
రమేశ్ ఆసుపత్రి యాజయాన్యం వాదన ఇదీ..
అయితే.. ఈ కేసు విషయంలో తమ వాదనలు వినాలని రమేష్ హాస్పిటల్ ఛైర్మన్ సీతారామ్మోహనరావు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలను వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని తమ పిటిషన్ లో కోరారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఈ అంశంలో సుప్రీం ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.