ఏపీలో వరుసపెట్టి దేవాలయాల్లో అరిష్ట సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇందుకు విరుగుడు చర్యలను సూచించాల్సిందిగా తన ఆస్థాన స్వామీజీ స్వరూపానంద సరస్వతిని కోరింది.
రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్ ,శ్రీరంగనాథరాజు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్రావు నేరుగా విశాఖపట్నంలోని శారదా పీఠానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వారు ఆయనకు వివరించారు. దీనికి స్పందించిన స్వామీజీ అంతర్వేది ,కొండ బిట్రగుంట దేవస్థానాల్లో రథాలు దగ్ధం కావడం అరిష్టానికి సూచనలని పరిహారంగా ఆ ఆలయాల్లో ప్రాయశ్చిత హోమాలు నిర్వహించాలని సలహా ఇచ్చారు.ఇవన్నీ ఎలా నిర్వహించాలో కూడా ఆయన వారికి వివరించారు.
ఇదే సందర్భంగా మంత్రులు ఆయనకు అంతర్వేది లో దగ్ధమైన రధం స్థానంలో నిర్మించతలపెట్టిన నూతన రధం నమూనాను చూపించారు.పాత రధం కన్నా శ్రేష్ఠమైనది తయారు చేయించాలని ఇందుకు నాణ్యమైన కలప ఉపయోగించాలని స్వామీజీ వారికి సలహా ఇచ్చారు.అంతేకాకుండా అంతర్వేది దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు .హైందవ సంప్రదాయాలపై అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ఆరు ఆగమాలకు చెందిన పండితులతో ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయడం మంచిదని కూడా స్వామీజీ చెప్పారు.కాగా టీడీపీ హయంలో ప్రతీ చిన్న విషయాన్ని మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు చేయడంలో రాటుదేలిపోయిన స్వరూపానంద ఇప్పుడు మాత్రం మంత్రుల్ని పిలిపించుకుని.. కాస్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో ఎంతో కాలంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. కొడాలి నాని వంటి వాళ్లు పేట్రేగిపోతున్నా… స్వరూపానంద ఒక్కసారంటే..ఒక్క సారి కూడా ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆయనకు హిందూత్వం కన్నా..రాజకీయ ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు విశాఖలోనే విశ్వ హిందు పరిషత్, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగినా…అదే విశాఖలో ఉన్న స్వరూపానంద స్పందించలేదు. మరోవైపు మంత్రులను పిలిపించుకుని ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలా బయటపడాలో వారికి సలహాలిచ్చి పంపారు.మరి ముఖ్యమంత్రి జగన్ కి ఆయనపై ఉన్న గురి అలాంటిది .ఆయనకూ వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రేమ అంతకు మించింది !