ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు గతంలోలా బయటకు వెళ్లలేకపోతున్నారు. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, హోటల్స్.. ఎక్కడికీ వెళ్లట్లేదు. అంతా కరోనా భయం నెలకొన్న ఈ సమయంలో ప్రజలంతా ఇంటి ఫుడ్ కే ఫ్రిఫరెన్స్ ఇచ్చారు. అయినా దేశంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు కూడా ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు చెప్తున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించిన లెక్కల ప్రకారం..
దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. ఏకంగా 5.5 లక్షల చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేశారు. 1.2 లక్షల కేక్స్, కిరాణా సరుకుల్లో 323 మిలియన్ల కిలోల ఉల్లిపాయలు, 56 మిలియన్ల అరటిపళ్ల ఆర్డర్లు వచ్చాయి. 1,29,000 చాకో లావా కేక్స్, రాత్రిపూట 65వేల భోజనం ఆర్డర్స్ కూడా వచ్చాయి. వీటితోపాటు గులాబ్ జామూన్, బటర్ స్కాచ్ కేక్స్ కూడా ఆర్డర్ చేశారు మన ఇండియన్స్.
వీటితోపాటు ప్రస్తుత కరోనా సమయంలో నిత్యకృత్యమైన మాస్కులు, శానిటైజర్లు కూడా స్విగ్గీ ద్వారా డెలివరీ అయినట్టు తెలిపింది. ఇందులో భాగంగా 73వేల బాటిల్ళ శానిటైజర్లు, 47వేల ఫేస్ మాస్కులు ఆర్డర్లు రాగా స్విగ్గీ డెలివరీ చేసింది. వ్యాపారపరంగా ఆర్డర్లతో పాటు స్విగ్గీ సేవా కార్యక్రమాలు కూడా చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టేందుకు 10 కోట్లు సమీకరించి 30 లక్షల మందికి భోజనాలు పెట్టింది కూడా.