ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తన ఖాతాదారులకు ఎన్నో భిన్న రకాల పాలసీలను అందిస్తున్న విషయం విదితమే. వాటిలో టర్మ్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, యాన్యుటీ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్.. అని అనేక రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పాలసీల్లో ఉన్న ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు.
ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ వల్ల డబ్బు ఆదా అవుతుంది. కుటుంబానికి రక్షణ కూడా ఉంటుంది. బోనస్, రిస్క్ కవర్ వంటి సదుపాయాలు ఉంటాయి. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పాలసీని తీసుకునేందుకు అర్హులు. ఇందులో భాగంగా కనీసం రూ.1 లక్ష విలువ చేసే పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గరిష్టంగా ఎంత మొత్తంతో అయినా పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ టర్మ్ 15 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో దీన్ని తీసుకోవచ్చు. 3, 6 నెలలు లేదా 12 నెలలకు ఒకసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించేలా ఇందులో సదుపాయం ఉంటుంది. అయితే పాలసీ తీసుకుని 3 సంవత్సరాలు గడిచాక దానిపై లోన్ కూడా ఇస్తారు.
పాలసీ మెచూర్ అయ్యాక బీమా మొత్తం, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తాయి. ఉదాహరణకు 25 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రూ.5 లక్షల బీమా మొత్తానికి 25 ఏళ్ల టర్మ్తో పాలసీ తీసుకుంటే.. మెచూర్ అయ్యాక పాలసీదారుడు జీవించే ఉంటే.. అప్పుడు మొత్తం రూ.13.37 లక్షలు వస్తాయి. దీనికి నెలవారీ ప్రీమియం రూ.1900 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు దాదాపుగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీలకు బీమా మొత్తం, బోనస్ ఇస్తారు. అయితే పాలసీ తీసుకునేవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.