Loans Through Mobile Apps: మొబైల్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునే వారు దేశంలో క్రమంగా పెరిగిపోతున్నారు. బ్యాంకులకు వెళ్లి తీసుకోవాలంటే తప్పకుండా షూరిటీ కావాల్సిందే. అందుకోసమే ఇన్స్టాంట్ లోన్స్ యాప్స్ పై చాలా మంది ఆధారపడుతున్నారు. ఈ రుణాలు తీసుకునే వారిలో ముఖ్యంగా విద్యార్థులే ఉంటున్నారని తెలిసింది. కొందరు చదువు కోసం, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు కోసం ఇంట్లో చెప్పకుండా లోన్స్ తీసుకుని అధిక వడ్డీ అయినా ఎలా గోలా కట్టేస్తున్నారు. మరికొందరు మాత్రం జల్సా కోసం లోన్స్ తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు లోన్ ఏజెంట్స్ బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఇప్పటికే చాలా వెలుగుచూశాయి.
ఆరు వందల ఫేక్ యాప్స్..
ఈ మధ్యకాలంలో పాకెట్ లోన్ యాప్స్పై చాలా మంది ఆధారపడుతున్నారని తెలియడంతో ఆర్బీఐ వీటిపై దృష్టి సారించింది. వీటి బ్యాగ్ గ్రౌండ్ గురించి విచారణ జరుపగా అందులో 600 వరకు ఫేక్ లోన్ యాప్స్ ఉన్నాయని గుర్తించి వెంటనే దేశంలోని పౌరులందరికీ అలర్ట్ జారీ చేసింది. ప్లే స్టోర్లో కనిపించే ప్రతీ యాప్ నమ్మదగిదని కాదని ఉత్తర్వులు జారీ చేసింది. తొందరపడి అందులో వివరాలు ఇచ్చి లోన్ పొందిన తిరిగి చెల్లించే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది.
చట్ట విరుద్ధ లోన్ యాప్స్ నియంత్రణకు RBI కొత్త చట్టం..
ప్రస్తుతం దేశంలోని ఇండియన్ ఆండ్రాయిడ్ కస్టమర్లకు 80కి పైగా యాప్స్ స్టోర్స్లో సుమారు 1100 రుణాలిచ్చే అప్లికేషన్స్ ఉన్నాయని RBI ప్యానెల్ ప్రకటించింది. క్విక్ లోన్, ఇన్స్టాంట్ లోన్ వంటి కీ వర్డ్స్ ఎంటర్ చేస్తే ఇల్లీగల్ లోన్ యాప్స్ ముందుగా వస్తాయని తెలిపింది. దేశంలో సైబర్, డిజిటల్ మోసాలు పెరుగుతున్న క్రమంలో వీటి నియంత్రణ కోసం ఆర్బీఐ కొత్త చట్టం తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతంలో చట్టవిరుద్ధ యాప్స్ నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేక చాలా మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా ఉన్న విషయం తెలిసిందే.