(చెన్నై నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తమిళనాడులో ఇటీవల ఒ యువతిని ప్రేమించి కులాంతర వివాహాం చేసుకున్న అన్నా డీఎంకె ఎమ్మెల్యే ప్రభుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వివాహం చేసుకున్న సౌందర్యను రేపు కోర్టు ముందు హాజరుపర్చాలని నోటీసు జారీ చేసింది. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు వివాహా వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
ఈ నెల నాల్గవ తేదీన ఎమ్మెల్యే ప్రభు (39) సౌందర్య (19) ను వివాహం చేసుకున్నాడు. సౌందర్య డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈ వివాహ సమయంలో సౌందర్య తండ్రి పెళ్లి వేదిక వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో తియ్యాగుదుర్గం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తన కుమార్తెను ఎమ్మెల్యే బలవంతంగా తీసుకువెళ్లి వివాహాం చేసుకున్నాడని సౌందర్య తండ్రి స్వామినాధన్ ఆరోపిస్తున్నారు. స్వామినాధన్ ఆరోపణలను ఎమ్మెల్యే ప్రభు ఖండిస్తున్నారు. పరస్పరం ఇష్టపూర్వకంగానే వివాహాం చేసుకున్నామని తెలుపుతున్నారు. సౌందర్య కూడా ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు తెలుపుతోంది.
అయితే ఎమ్మెల్యే ప్రభు తన కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడనీ, తన కుమార్తెకు ఇంకా 19 ఏళ్లు నిండలేదని సౌందర్య తండ్రి స్వామినాధన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సౌందర్యను రేపు (శుక్రవారం) కోర్టు ముందు హజరుపర్చాలని ప్రభును ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.ఎమ్మెల్యే ప్రభు, సౌందర్యల ప్రేమ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.