తమిళనాట నాలుగు పర్యాయాలు ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత జయలలిత నివాసం చెన్నై పోయెస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం బుధవారం గెజిట్ విడుదల చేసింది.
దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006, మే 2015 నుండి డిసెంబర్ 2016 మరణించే వరకు ముఖ్యమంత్రి గా ఉన్నారు. అంతకు ముందు 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2014 సెప్టెంబరు 27 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత అరెస్టు అయ్యారు. దాంతో ఆమె తన ముఖ్య మంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత 2016 డిసెంబరు 5న రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జయలలిత మరణానంతరం పన్నీరు సెల్వంను ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నారు. జయలలితను ఆమె అభిమానులు పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మ గా సంభోదించేవారు.
కాగా వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం ఈ నెల 25వ తేదీన సివిల్ కోర్టులో రూ.67.9 కోట్లు జమ చేసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవ్వకతప్పదు. కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి.
ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయంటే..
వేద నిలయంలో 4.3 కిలోల బంగారం, 601 కిలోల వెండి, 10,438 దుస్తులు, 8,300 పుస్తకాలు, పూజ వస్తువులు, పలు వస్త్రాలు కలిపి మొత్తం 32,721 వస్తువులున్నాయి. వాటిలో 162 వెండి వస్తువులు, 11 టీవీలు, పది రిఫ్రిజిరేటర్లు, 38 ఎయిర్ కండీషనర్లు, 556 ఫర్నిచర్ , 6,514 కిచెన్ పాత్రలు, 1055 షో కేస్ కత్తులు, 15 పూజ పాత్రలు, 10,438 పాద రక్షలు, 29 మొబైల్ ఫోన్ లు, 221 కిచెన్ ఎలక్ట్రికల్ ఉప కరణాలు, 394 జ్ఞాపికలు, 653 ఐటీ, కోర్టు, లైసెన్సుల పత్రాలు, 65 సూట్ కేసులు, ఆరు గడియారాలు, 108 సౌందర్య సాధనాలు ఉన్నాయి.