తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని కల్కి ఆశ్రమంలో ఐటి శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంతో పాటు తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమానికి చెందిన కార్యాలయాలపై ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు చేపట్టారు. కల్కి భగవాన్ ప్రధాన ఆశ్రమం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దీంతో తమిళనాడుకు చెందిన ఐటి బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. దాడుల సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటి అధికారులు విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని ఆశ్రమ ప్రధాన ద్వారం మూసివేసి ఐటి అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక్కడ ట్రస్ట్ నిర్వహకుడు లోకేష్ దాసాజీతో పాటు మరి కొంత మంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఆశ్రమాల్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు.
previous post
next post