అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ స్వగ్రామం కృష్ణాజిల్లా కురుముద్దాలి. ఆయన గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995 లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్టీషియాలజిస్ట్ గా పని చేస్తూ హ్యూస్టన్ లో స్థిరపడ్డారు. 2017 నుండి తానా బోర్డు డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
శ్రీనివాస్ భార్య వాణి ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారు. పెద్ద కుమార్తె మెడిసిన్ చదువుతుండగా, చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది. అయితే దసరా పండుగ కోసం పెద్ద కుమార్తెను హ్యూస్టన్ కు తీసుకురావడానికి వాణితో పాటు ఆమె చిన్న కుమార్తె కారులో బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి కారును ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ప్రమాద స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో శ్రీనివాస్ షాక్ లోకి వెళ్లిపోయారు.శ్రీనివాస్ తండ్రి కొడాలి రామ్మోహనరావు విజయవాడలో స్తిరపడ్డారు. నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మృతి పట్ల తానా సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగేంద్ర శ్రీనివాస్ స్వగ్రామమైన పామర్రు మండలం కురుముద్దాలి గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం..చర్చించే అంశాలు ఇవి..?