భారతదేశంలోని దిగ్గజ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అరుదైన ఘనత సాధించింది. సోమవారం తనకు పోటీ అయిన మరొక దిగ్గజ ఐటీ సంస్థ యాక్సెంచర్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటి కంపెనీ గా అవతరించింది. జనవరి 25 వ తేదీ ఉదయం నాటికి మార్కెట్ విలువ 169.9 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లెక్కల ప్రకారం యాక్సెంచర్ మార్కెట్ విలువ 168 బిలియన్ డాలర్లు.
అయితే మార్కెట్ క్యాప్ కు సంబంధించి టీసీఎస్ ఇదివరకే రెండు సార్లు యాక్సెంచర్ కంపెనీ మార్కెట్ విలువ ను అధిగమించింది. మొదటిసారి 2018 లో టిసిఎస్ ఈ ఘనత సాధించింది. అలాగే గత ఏడాది అక్టోబర్ లో కూడా టిసిఎస్ యాక్సెంచర్ ను దాటేసింది. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితులవల్ల tcs షేర్ వేల్యూ బాగా తగ్గింది.
దీంతో వారి మార్కెట్ క్యాపిటలైజేషన్ 167 బిలియన్ డాలర్లకు పడిపోయింది. యాక్సెంచర్ ఒక అమెరికన్-ఐరిష్ మల్టీనేషనల్ కంపెనీ ఐటీ సంస్థ. వారి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అయితే ఎప్పటిలాగే టీసీఎస్ నెంబర్ వన్ స్థానంలో కాసేపు మాత్రమే నిలిచి ఉంది. కానీ ఈరోజు టిసిఎస్ ఆల్ టైం గరిష్టం రూ. 3339 ని తాకింది. ఈ సమయంలోనే వారు మార్కెట్ పరంగా యాక్సెంచర్ ను దాటారు.
TCS భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ. ఇక ఒక ప్రముఖ సంస్థ కింద ఉండే లిస్టెడ్ కంపెనీల ను పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో అంబానీకి చెందిన రిలయన్స్ మొదటి స్థానంలో ఉంటే TCS రెండో స్థానంలో ఉంటుంది. మిగతా ఐటీ సంస్థల మార్కెట్ వ్యాల్యూ ల విషయానికి వస్తే ఇన్ఫోసిస్ 78 బిలియన్ డాలర్ల, HCL టెక్నాలజీస్ $36 బిలియన్, విప్రో 33 బిలియన్ డాలర్లు, టెక్ మహేంద్ర 13 బిలియన్ డాలర్లుగా ఉంది.