అమరావతి: ప్రశాంత్ కిషోర్ సలహాతో వైస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని టిడిపి ఎంఎల్సి బుద్ధా వెంకన్న ఆరోపించారు. కిషోర్ కథ అల్లారు.. జగన్ దాన్ని అమలు చేసారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. వివేకా హత్యపై జగన్ వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బుద్ధా వెంకన్న శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
రక్తపు మడుగులో వివేకానంద రెడ్డి పడి ఉంటే గుండె పోటుతో చనిపోయారని ఎందుకు చెప్పారు?. వివేకా మృతిపై జగన్, అవినాష్ ఎందుకు స్పందించటంలేదు? అని బుద్ధా ప్రశ్నించారు. వివేకాను కుటుంబంలో వ్యక్తే హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. వివేకాకు రాజకీయంగా ఏ పార్టీలో శత్రువులు లేరు. జగన్ కుటుంబంతో తప్ప వివేకానందరెడ్డికి ఎవరితో గొడవలు లేవు అని బుద్ధా అన్నారు.
గతంలో మంత్రి పదవి తీసుకోవద్దని వివేకాను జగన్ కోరారని గుర్తుచేశారు. మొన్నటికి మొన్న లోటస్పాండ్ నుంచి వివేకా కన్నీళ్లతో కారెక్కి వెళ్లింది వాస్తవమా.. కాదా.. అని బుద్ధా ప్రశ్నించారు. వివేకా హత్యపై జగన్ వాస్తవాలు చెప్పాలని బుద్ధా డిమాండ్ చేశారు.
‘ వివేకా హత్యలో ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టించాలనే దురుద్దేశంతో వివేకా హత్య జరిగిందని ప్రజల అనుమానం. హత్య చేసి సానుభూతి సంపాదించాలని కుట్ర చేస్తున్నారు. సినీ ఫక్కీలో హత్య చేశారని ప్రజల్లో అనుమానం ఉంది. సొంత చిన్నాన్న చనిపోతే జగన్ తాపీగా లోటస్ పాండ్ లో ఉన్నారు. బాబాయిని హతమార్చి రాజకీయాలకు వాడుకుంటారని ఎవరూ అనుకోలేదు. శవ రాజకీయాలు చేయటం జగన్కు కొత్తేమి కాదు గతంలో వైస్ చనిపోయినప్పుడు కూడా ఇలానే చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఏదైనా చేస్తారు ‘ అని బుద్ధా వ్యాఖ్యానించారు.
ఘటన స్థలంలో రక్తపు మరకలు చెరిపింది ఎవరు? సీబీఐతో దర్యాప్తు చేయించాలని అనుకోవటం నిజం కాదా? అని బుద్ధా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే తెలంగాణ పోలీసులతో జగన్ మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఫ్యాక్షన్ హత్యలు ఆగిపోయాయని అన్నారు.