అమరావతి: వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు.
టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు.
సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందనీ చంద్రబాబు అన్నారు. అభ్యంతకరమైనవి కాకున్నా టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించారని చంద్రబాబు తెలిపారు.
వారు పెట్టిన పోస్టింగ్లు, వాటిపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనే విషయాలను చంద్రబాబు వివరించారు. టిడిపి వారు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా కేవలం వైసిపి వారు ఇచ్చిన ఫిర్యాదులపైనే పోలీసులు టిడిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని చంద్రబాబు అన్నారు.
దారుణాతిదారుణంగా టిడిపి మహిళా నేతలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
వీటిపై డిజిపి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజా స్వామ్యాన్ని కాపాడేలా పని చేయాలని చంద్రబాబు సూచించారు.
ఇలాంటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పంచాయతీతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందిస్తారనీ, ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తిరగబడతారని చంద్రబాబు హెచ్చరించారు. టిడిపి కార్యకర్తలకు, సోషల్ మీడియా వాలంటీర్లకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.