ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. అమరావతి రాజధాని ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసి ఆధ్వర్యంలో జనభేరి సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ నేత చంద్రబాబు వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉంటుంది అని సీఎం జగన్ చెప్పాలి లేదా జగన్ కు దమ్ముంటే రెఫరెండంకు సిద్ధం కావాలన్నారు. 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందాం, జగన్ గెలిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు. తాను అధికారం కోసం పోరాటం చేయడం లేదని, తనకు అదికారం కొత్తకాదని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఇష్టానుసారం ఆరోపణలు చేశారు, 18 నెలలు అయ్యింది ఏమి చేశారని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానం, ఎడారి అనడానికి మీకు బుద్దుందా అని చంద్రబాబు నిలదీశారు. తన కులం వారు ఉన్నారని హైదరాబాద్ను, విశాఖను అభివృద్ధి చేయలేదని ప్రజల కోసం పని చేశానని అన్నారు.
జగన్ రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతి మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది అంటూ చంద్రబాబు శాపనార్ధాలు పెట్టారు. ఈ సందర్భంగా నంద్యాలలో జరిగిన అబ్దుల్ సలాం కుటుంబం అత్మహత్యతో పాటు రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలను పేర్కొంటూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. పేటిఎం బ్యాచ్ తో మూడు రాజధానుల ఉద్యమాన్ని చేయిస్తారని దుయ్యబాట్టారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నాడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ కూడా ఆమోదం తెలిపారని అన్నారు. ఆనాడు మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమానికి అయిదు కోట్ల ఆంధ్రులు మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి పోరాటం ఏడాది పాటు కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. రాజధాని మార్పుపై జగన్ ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్ పునరాలోచన చేయాలని అన్నారు. కాంగ్రెస్, బీజెపీ, వామపక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఘనత అమరావతి ఉద్యమానిదని అన్నారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి.. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్య అని విమర్శించారు. మూడు రాజధానులపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు హేతుబద్దంగా లేవని అన్నారు. టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ రైతులపై అక్రమ కేసులు పెట్టినా వెనక్కు తగ్గలేదని అన్నారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, జెఏసి నేతలు ప్రసంగించారు. తొలుత రాజధాని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు ప్రదర్శనగా సభాస్థలికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సిస్ రహదారిపై రాజధానికి వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా వేదికపై అమరావతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించారు. అమరావతి సమరగాధ పేరిట బుర్రకథ ప్రదర్శించారు. అమరావతి దళిత జేఎసీ ఆధ్వర్యంలో 300మంది మహిళలు, రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు. కాగా ముందుగా చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలబడి కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు ఉన్నతాదికారులు అనుమతించడంతో చంద్రబాబు ఉద్దండరాయునిపాలెం చేరుకుని శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి యాగశాలలో సాష్టాంగ నమస్కారం చేశారు.