రాష్ట్రంలో మరో ఎన్నికలకు ప్రధాన రాజకీయ పక్షాలు సన్నద్దం అవుతున్నాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకూ ఈ ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి లోక్ సభ, బద్వేల్, ఉదయగిరి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, అంతకు ముందు స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో హవా చాటిన వైసీపీ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు నిర్ణయించుకుంది. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు నేరుగా బరిలో దిగేవి కాదు. ఉపాధ్యాయ సంఘాలు ఇతర ప్రజా సంఘాల నుండి బరిలో దిగిన వారికి ప్రధాన రాజకీయ పక్షాలు మద్దతు ఇస్తుండేవి. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా, తాజాగా టీడీపీ కూడా ఎన్నికలకు ‘సై’ అంటోంది. ఈ క్రమంలోనే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారు.
చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్ఎస్ జీ.. భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
పశ్చిమ రాయలసీమ అభ్యర్ధిగా భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమకు కంచర్ల శ్రీకాంత్ అభ్యర్ధిగా చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారు. ఇక నుండి ఏ ఎన్నిక వచ్చినా టీడీపీ పోటీ అనివార్యమని చెప్పారు చంద్రబాబు., గెలుపే ధ్యేయంగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు. అయితే విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చంద్రబాబు ప్రకటించలేదు. అక్కడి ఎమ్మెల్సీ అభ్యర్ధిని స్థానిక నేతలే నిర్ణయిస్తారని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే ఆ అభ్యర్ధి పై కూడా స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే విశాఖలో బీజేపీ నేత ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలో ఉంటారని, ఆ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశమున్నందున దానిని పెండింగ్ లో పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్ధిగా బ్రాహ్మణ కార్పోరేషన చైర్మన్ సుధాకర్, అనంతపురం – కడప – కర్నూలు నియోజకవర్గానికి వెన్నపూస రవీంద్ర రెడ్డి, చిత్తూరు – ప్రకాశం – నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పెర్నాటి శ్యామ్ ప్రసాదరెడ్డి లను అభ్యర్ధులుగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జులైలోనే ప్రకటించారు. వైసీపీ అభ్యర్ధులను ప్రకటించిన నెలా పదిహేను రోజుల తర్వాత టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.
ప్రస్తుతం ఆయా స్థానాలకు బీజేపీ నేత మాధవ్ (విశాఖ), వైసీపీ నేత వెన్నపూస గోపాలకృష్ణ (అనంతపురం), ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత వై శ్రీనివాసులు రెడ్డి ( చిత్తూరు) ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ నాటికి ముగియనుంది. ఈ సారి ప్రధాన రాజకీయ పక్షాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడం విశేషం.