(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారనీ, పోలీసులు దగ్గరుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. వారికి 144, పోలీస్ యాక్ట్ 30ని వర్తింపజేయడం లేదు కానీ జెఏసి ఆధ్వర్యంలో మూడు రాజధానులు వద్దు.. అమరావతే రాజధానిగా కావాలి అంటూ ప్రజలు శాంతియుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసన తెలపడాన్ని కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
దుర్గమ్మకు మొక్కు తీర్చుకోవడానికి పొంగళ్లు తీసుకెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేయడం ప్రజా హక్కులను కాలరాయడం కాదా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటు కాళ్లతో తన్నడం, లాఠీలతో బాదడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని మండిపడ్డారు. దీర్ఘ కాలం 144 సెక్షన్ అమలు చేయడం చట్ట విరుద్దమని సుప్రీం కోర్టు చెప్పినా కూడా అమరావతి పరిధిలో సుదీర్ఘ కాలం అమలు చేయడం దుర్మార్గం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ గాయాలపాలు చేసి ఆసుపత్రుల్లో చేరేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ రకంగా వివక్షా పూరితంగా పోలీసులు వ్యవహరిస్తే డిజిపి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చట్టబద్ద చర్యలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఇకనైనా చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని చంద్రబాబు హితవుపలికారు.