అమరావతి: ఎన్నికల నేపథ్యంలో టిడిపి అభ్యర్థులపై జరుగుతున్న ఐటి దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వరంలో ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ముగ్గురు టిడిపి అభ్యర్థులపై ఉద్దేశపూర్వకంగానే ఐటి దాడులు జరిపారని ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. నామినేషన్ తర్వాత ఐటి దాడులు జరపడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో వైసిపి డబ్బులు వెదజల్లుతోందని ఆరోపిస్తూ అందుకు సంబందించిన వీడియో టేపులను సిఈఓకు అందజేశారు.
అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో కలిసి వైసిపి ఎన్నికలు జరగకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని కనకమేడల ఆరోపించారు. వైసిపి ఓటమి భయంతో అశాంతి రాజేసే కుట్ర చేస్తున్నదని కనకమేడల అన్నారు. మైలవరంలో పోలీసులపై దాడి అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సాక్షి పత్రికలో అవాస్తవాలతో పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయని కనకమేడల అన్నారు. వైసిపికి ఉపయోగపడే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇక టిడిపి ప్రతినిధుల ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది ఐటి అధికారులను ఫోన్లో వివరణ కోరారు. దీనిపై నోటీసులు పంపుతామని, దాడులపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఐటి అధికారులను ఆయన ఆదేశించారు.
ఒక పక్క టిడిపి నేతలు ఐటి దాడులపై ఫిర్యాదు చేస్తున్న తరుణంలోనే ఆ పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర ఆస్తులపై ఐటి దాడులు జరిగాయి. కోవెలమూడి వ్యాపార సంస్థల్లో మరోసారి ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. నెల రోజుల క్రితమే కోవెలమూడి సంస్థల్లో ఐటి సోదాలు జరిగాయి.