TDP : టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రచార వ్యూహాలను సిద్ధం చేసిన చంద్రబాబు.. నారా లోకేష్, అచ్చెన్నాయుడు సహా సీనియర్ నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు. అలాగే ఎన్నికల వ్యవహారాన్ని సమన్వయ పరిచే బాధ్యతను వర్ల రామయ్య, బోండా ఉమా, టిడి.జనార్దన్కు అప్పగించారు.
వాలంటీర్ల పై కన్ను!
పక్కా వ్యూహాలతో తిరుపతి ఉప ఎన్నికలకు వెళ్తున్న టిడిపి అధినేత చంద్రబాబు.. రోజువారి కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ప్రతిరోజు స్థానిక వర్గాల నుంచి ఎప్పటికప్పుడు పార్టీ కార్యాలయానికి ఫీడ్బ్యాక్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక న్యాయవాదిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి సహకరించే వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై లీగల్ సెల్ ద్వారా ఫిర్యాదులు చేయాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలను ప్రస్తావించేలా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
TDP : గెలుపు మాటేమోగానీ అలుపు లేకుండా పని!
తిరుపతి ఉప ఎన్నికలో నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాలని జగన్ టార్గెట్ గా నిర్దేశించిన నేపథ్యంలో టిడిపి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది.తిరుపతి ఉప ఎన్నిక జరగడం ఖాయమని తేలిన వెంటనే టిడిపి అందరికన్నా ముందు తన పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించటం తెలిసిందే.మొన్నటి ఎన్నికల్లో కూడా పనబాక లక్ష్మి వైసిపి అభ్యర్థి దివంగత సిట్టింగ్ ఎంపీ బలి దుర్గాప్రసాదరావు చేతిలో రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.అప్పట్లో ఆగాలి వేరని ..ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందని టిడిపి అంచనాలు వేస్తోంది.గెలుపు విషయం పక్కన పెడితే కనీసం గౌరవప్రదంగానైనా ఓడిపోయేలా ఉండడం కోసం టిడిపి సర్వశక్తులు ధారబోస్తోంది.వైసీపీ కూడా ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోకుండా ఏడుగురు మంత్రులు ఇద్దరు సీనియర్ మంత్రుల ఆధ్వర్యంలో టీమ్ గా ఏర్పడి తిరుపతిలో గెలుపు బాధ్యతలను భుజాలపై వేసుకున్న విషయం తెలిసిందే.